మొత్తానికి ఐ.పి.ఎల్. ని భారత్ లో నిర్వహించకూడదని నిర్ణయించారు. కారణమేదైనప్పటికి ఇలాంటి నిర్ణయం వెలువడటం బాధాకరమైన విషయం. క్రికెట్ ని అమితంగా ఇష్టపడే భారతీయులు ఈ ఐ.పి.ఎల్ కోసం సంవత్సరకాలంగా ఎదురు చూసారు. ఈ నిర్ణయం వాళ్ళందర్నీ బాగా నిరుత్సాహపరిచుంటుంది. ఇప్పుడు ఈ పోటీని ఇంగ్లండులో కానీ సౌతాఫ్రికాలో కానీ నిర్వహిస్తార్ట. బి.సి.సి.ఐ. అంటే పడని ఇంగ్లండు బోర్డ్ ఇప్పుడు దీన్ని నిర్వహించటానికి ఉవ్విళ్ళూర్తోందని వార్తల్లో చదివాను. “డబ్బుకు లోకం దాసోహం” అంటే ఇదే కాబోలు.
ఇక మన దేశంలో ఎన్నికలు ముంచుకొస్తుండటంతో ఆటగాళ్ళకి రక్షణ కల్పించలేమని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పేసాయి. ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే ఊహించామని చెప్తున్న బి.సి.సి.ఐ. అందుకు తగిన చర్యలు ముందే చేపట్టుంటే బహుశా భారత్లోనే పోటీ నిర్వహించగలిగే అవకాశం దొరికుండేది. ఇప్పుడు క్రికెట్ విందులేక మాడిపోయేది భారత ప్రేక్షకులే.